ఓహో.. ఇప్పుడు దొరికావా? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు?” – రెండేళ్లుగా కనిపించకుండా పోయిన తన భార్యను పోలింగ్ బూత్ వద్ద చూడగానే ఆ భర్త అడిగిన ప్రశ్న ఇది.
పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశ ఎన్నికల సమయంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
తారాబారి ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ బూత్ నంబర్ 25/238 వెలుపల ఒక వ్యక్తి ఎండను కూడా లెక్కచేయకుండా గంటల తరబడి పడిగాపులు కాస్తున్నాడు. చెమటతో తడిసిపోయినప్పటికీ, అతని కళ్లు మాత్రం బూత్ లోపలికి వచ్చే ప్రతి మహిళ ముఖాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల సమయం. ఒక మహిళ చేతిలో ఓటర్ ఐడీ కార్డు పట్టుకుని ఉత్సాహంగా పోలింగ్ కేంద్రం వైపు అడుగులు వేసింది. ఆమె దగ్గరకు రాగానే, గంటల తరబడి ఆకలితో ఉన్న పులిలా వేచి చూస్తున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డాడు. వెనుక నుంచి ఆమె జుట్టు పట్టుకుని లాగి, అందరి ముందు ఆమెను తిట్టడం మొదలుపెట్టాడు.
అక్కడ భద్రత కోసం ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CAPF) సిబ్బంది వెంటనే స్పందించి ఆ మహిళను అతని పట్టు నుండి విడిపించారు. విచారణలో అసలు నిజం బయటపడింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, సదరు మహిళ భర్త. రెండేళ్ల క్రితం ఆమె ఇల్లు వదిలి పారిపోయింది. మరో వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమెకు, పాత భర్త జ్ఞాపకమే లేదు.
అయితే ఆమెను పట్టుకోవడానికి అతను ఉపయోగించిన వ్యూహం అద్భుతమనే చెప్పాలి. రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు కఠినంగా ఉన్నందున, ఓటు వేయడానికి ఆమె కచ్చితంగా తన పాత చిరునామా ఉన్న పోలింగ్ బూత్కే రావాలని అతను లెక్క వేశాడు. అతని అంచనా తప్పలేదు; ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన భార్య భర్త వేసిన వలలో చిక్కింది.
పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నప్పుడు అతను ఒక వింత డిమాండ్ చేశాడు. “ఈమె ఓటర్ ఐడీలో నా పేరును ముందుగా తొలగించండి, అది తొలగించే వరకు ఈమెను ఓటు వేయనివ్వకండి” అని అరిచాడు. కానీ ఎన్నికల సిబ్బంది అతని డిమాండ్ను తిరస్కరించి, మహిళకు ఓటు వేసే అవకాశం కల్పించారు.
