పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, కేరళ అసెంబ్లీలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ముఖ్యంగా అందరి దృష్టి బెంగాల్ ఎన్నికలపై పడింది.
ఈసారి అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీ మధ్య రసవత్తర పోటీ నెలకొంది. మమతా బెనర్జీని గద్దె దించాలనే వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోంది. అయితే, బెంగాల్ వ్యాప్తంగా 30 శాతం వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరంతా మమతా బెనర్జీ వైపు మద్దతుగా నిలుస్తారని, హిందూ ఓటర్లను బీజేపీ సంఘటితం చేసే పనిలో ఉంది. ఇదిలా ఉంటే, బెంగాల్ ఎన్నికలకు సంబంధించి 19 మందితో బీజేపీ మూడో విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.
ఈ ఎన్నికల్లో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అత్యాచారం, హత్య బాధితురాలి తల్లికి బీజేపీ టికెట్ కేటాయించింది. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. 2024లో పీజీ ట్రైనీ డాక్టర్పై ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన బెంగాల్తో పాటు దేశాన్ని కదిపేసింది. ప్రస్తుతం బాధితురాలి తల్లి రత్న దేబ్నాథ్ను బీజేపీ పాణిహతి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతోంది.
బెంగాల్లో మహిళల భద్రత, శాంతిభద్రతను మమతా బెనర్జీ పట్టించుకోవడం లేదని బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకుని మహిళల్లో మద్దతు కూడగట్టేలా పార్టీ వ్యూహాలు రచిస్తోంది. పాణిహతి నియోజకవర్గం ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఉంది. ఈ స్థానం నుంచి టీఎంసీ తరఫున తీర్థంకర్ ఘోష్, సీపీఐ(ఎం) అభ్యర్థి కల్లాతన్ దాస్గుప్తాతో ఆమె తలపడనున్నారు. తీర్థంకర్ ఘోర్ అసెంబ్లీ చీఫ్ విఫ్ నిర్మల్ ఘోష్ కుమారుడు కావడం గమనార్హం.
అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత, దేబ్నాథ్ మాట్లాడుతూ.. తాను గెలిస్తే పాణిహతి ప్రజలు గెలుస్తారని అన్నారు. నియోజకవర్గ సమస్యల్ని తీరుస్తానని హమీ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయడం గర్వకారణం అని అంటూనే ఇది బాధకరమైన బాధ్యత అని భావోద్వేగానికి గురయ్యారు. తాను పేదల కోసం పనిచేస్తే తన కూతురు ఆత్మ కూడా శాంతిస్తుందన్నారు. బెంగాల్ అంతటా కమలం వికసిస్తుందని చెప్పారు.
సంచలనం రేపిన ఆర్జీకర్ కేసు..
2024లో కోల్కతాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్న పీజీ ట్రైనీ వైద్యురాలిపై సంజయ్ రాయ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు పోలీస్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. ఘటన తర్వాత బెంగాల్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ప్రజలు నినదించారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయగా, ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు జనవరి 2025లో కోర్టు జీవిత ఖైదు విధించారు.
హత్రాస్తో బీజేపీకి టీఎంసీ చెక్
బీజేపీ ఆర్జీకర్ వైద్యురాలి తల్లికి టికెట్ ఇచ్చిన తర్వాత బీజేపీపై అధికార టీఎంసీ విమర్శల్ని తీవ్రం చేసింది. మహిళల భద్రత గురించి బీజేపీ మాట్లాడుతుంటే తమకు ఆశ్చర్యంగా ఉందని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అత్యాచారాలు, హత్యల సంగతి ఏంటని ప్రశ్నించారు. ఉన్నావ్, హత్రాస్ ఘటనల్ని మరిచిపోయారా? అంటూ విమర్శించారు.
