ఇరాన్(iran)పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్దం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ నాలుగు రోజుల్లో ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని అంతమొందించిన అమెరికా-ఇజ్రాయెల్ కు ఇప్పుడేం చేయాలో తెలియట్లేదు.
ఓవైపు ఇరాన్ ప్రతీకార దాడుల్లో గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ లు, ఎంబసీలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. మరోవైపు గల్ఫ్ దేశాల ఆస్తులకూ తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో ఇజ్రాయెల్ ను మాత్రమే రక్షిస్తూ మిమ్మల్ని వదిలేస్తారా అంటూ గల్ఫ్ దేశాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump)పై ఒత్తిడి పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అడుగులు వేస్తున్నారు. ఈ యుద్దం మొదలయ్యాక నిరంతరం మీడియాకు ఇంటర్వూలు ఇస్తూ బిజీగా కనిపిస్తున్న ట్రంప్.. ఆరంభంలో ఇరాన్ పై యుద్ధం కేవలం వైమానిక దాడులకే పరిమితం అవుతుందని, ఎక్కువ కాలం కొనసాగే అవకాశం కూడా లేదని, త్వరగానే ముగించేస్తామని ప్రకటించారు. కానీ యుద్దం ముందుకు సాగే కొద్దీ ఇరాన్ ప్రతిఘటన పెరుగుతుండటం, తన మిత్రులైన గల్ఫ్ దేశాల్లో నష్టం అంతకంతకూ పెరిగిపోతుండటంతో ట్రంప్ తన నిర్ణయంపై యూటర్న్ తీసుకున్నారు.
తాజాగా న్యూస్ నేషన్ జర్నలిస్ట్ కెల్లీ మేయర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్.. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి, అమెరికా పౌరుల మరణాలకు త్వరలో ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడించారు. గతంలో నేలపై మా బూట్లు అడుగుపెట్టవని చెప్పిన ట్రంప్.. ఇప్పుడు అవసరమైతే అడుగు పెడతాయని చెప్పుకొచ్చారు. ఇరాన్పై తన సైనిక కార్యకలాపాల కోసం అంచనా వేసిన నాలుగు నుండి ఐదు వారాల కాలపరిమితి కంటే అమెరికా చాలా ఎక్కువ సమయం వెళ్ళే సామర్థ్యం కలిగి ఉందన్నారు. అంటే ఇరాన్ యుద్దం నాలుగు వారాలకు మించి ఉంటుందనే అంచనాకు వచ్చేశారు.
