ఏపీ అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnam Raju)ను గత వైసీపీ ప్రభుత్వంలో కస్టడీలో హింసించిన కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్, బీహార్ ఐజీ సునీల్ నాయక్ ను గుంటూరు పోలీసులు తాజాగా అరెస్టు చేసేందుకు ఆ రాష్ట్రానికి వెళ్లారు. అరెస్టు చేశాక అక్కడి స్థానిక కోర్టు ట్రాన్సిట్ వారెంట్ నిరాకరించడంతో ఏపీకి తీసుకురాలేకపోయారు. ఈ నేపథ్యంలో గుంటూరు కోర్టును ఆశ్రయించి ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే ట్విస్ట్ ఎదురైంది.
గుంటూరు కోర్టు న్యాయమూర్తి స్రవంతి ముందు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నట్లు ప్రకటించినా.. ఆ తర్వాత సునీల్ నాయక్ తరఫు న్యాయవాదులు దీనికి అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే బీహార్ లోని పట్నా కోర్టు ఆయన్ను అరెస్టు చేయకుండా తాత్కాలిక ఊరటనిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. దీంతో న్యాయమూర్తి.. పోలీసుల్ని ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదని అడిగారు. దీనికి వారు తమకు కూడా ఈ విషయం తెలియదని చెప్పినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ పై జారీ చేసేందుకు సిద్దమైన నాన్ బెయిలబుల్ వారెంట్ ను నిలిపేస్తూ గుంటూరు కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పట్నాలో సునీల్ నాయక్ నివాసానికి వెళ్లి దౌర్జన్యంగా ఆయన్ను అరెస్టు చేసారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను మరోసారి అదుపులోకి తీసుకోకుండా స్థానిక కోర్టు రక్షణ కల్పించింది. సునీల్ నాయక్ ఏపీ పోలీసుల విచారణకు హాజరవుతారని అక్కడి కోర్టుకు ఆయన లాయర్లు తెలిపారు. దీంతో విచారణ వాయిదా పడింది. మొత్తం మీద సునీల్ నాయక్ కు ఏపీలోనూ తాత్కాలిక లభించినట్లయింది.
