హిమాలయ దేశం నేపాల్ తీవ్ర అశాంతిలో ఉంది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేయాలి, అవినీతి ఆపాలి అంటూ వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు.
ప్రభుత్వం సోషల్ మీడియా యాప్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినా ఆందోళనలు ఆగలేదు. సెప్టెంబర్ 7న మొదలైన ఈ ఉద్యమం సెప్టెంబర్ 8న పార్లమెంట్ వైపు దూసుకెళ్లడంతో పోలీసులతో ఘర్షణలకు దారితీసింది. భద్రతా దళాలు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 19 మంది యువకులు మృతి చెందగా, వందల మందికి గాయాలయ్యాయి. ఈ పరిణామాల తర్వాత హోం మంత్రి, అనంతరం అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం రాజకీయ నేతలు దేశం వదిలి పారిపోయిన పరిస్థితి కనిపించింది.
నిరసనల వేళ నెపో కిడ్స్, పొలిటిషియన్ నెపో బేబీ అంటూ నేపాల్లో కొన్ని సోషల్ మీడియాల్లో హ్యాష్ట్యాగ్లు వైరల్ అవుతున్నాయి. దేశంలో నిరుద్యోగం, అవినీతి తాండవిస్తున్నా.. ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నా.. రాజకీయ నేతల పిల్లలు, ధనికులు ఆడంబరమైన జీవితం అనుభవిస్తుండడంతో.. యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాజకీయ నాయకులు పిల్లలు విదేశాల నుంచి గూచి బ్యాగులతో వస్తుంటే.. మిగతా పిల్లలు మాత్రం శవపేటికల్లో వస్తున్నారు అని ఓ నిరసనకారుడు ప్లకార్డు ప్రదర్శించడం పరిస్థితికి అద్దం పడుతోంది. తమ తల్లిదండ్రులు సంపాదించిన అవినీతి సొమ్మును నెపో కిడ్స్ ఆస్వాదిస్తున్నారని కొందరు నిరసనకారులు మండిపడ్డారు.
నిజానికి ఈ నిరసనల వెనుక కేవలం సోషల్ మీడియా బ్యాన్ మాత్రమే కారణమా.. లేదా లోపల, బయట నుంచి మరింత పెద్ద కుట్ర నడుస్తుందా అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా ఈ పరిణామాలతో పాటుగా నేపాల్లో మళ్లీ రాచరిక పాలనకు మద్దతు గళం వినిపించడం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో రెండు దశాబ్దాల కిందట దేశాన్ని రక్తంతో తడిపిన రాజమహల్ నరమేధం మళ్లీ చర్చలోకి వచ్చింది. 2001లో రాజమహల్లో జరిగిన నరమేధం ఆ దేశ చరిత్రలో మరిచిపోలేని అధ్యాయంగా నిలిచింది. మహారాజు బీరేంద్ర బీర్ విక్రమ్ షా దేవ్, మహారాణి ఐశ్వర్య రాజ్యలక్ష్మి దేవి, యువరాజు దీపేంద్ర, చిన్న యువరాజు నిరంజన్, యువరాణి శ్రుతి.. ఇలా ఒకేసారి రాజకుటుంబం దాదాపు మొత్తం అంతరించిపోయిన సంఘటనను గుర్తు చేసుకోవడమే ఇప్పుడు నేపాల్ ప్రజల్లో కలకలం రేపుతోంది.
