Supreme Court: కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో న్యాయవాదులు, కక్షిదారులు అసలు లేని కోర్టు తీర్పులను సృష్టించి కోర్టుల్లో ఉటంకిస్తున్న విషయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఇటువంటి కల్పిత తీర్పులను ఉదహరించడం భారత్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రమాదకర ధోరణిగా మారుతోందని జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ల ధర్మాసనం వ్యాఖ్యానించింది.
బాంబే హైకోర్టు ఘటన:
ఇటీవల బాంబే హైకోర్టులో ఒక కంపెనీ డైరెక్టర్కు సంబంధించిన కేసులో కక్షిదారుడు చాట్జీపీటీ సహాయంతో వాదనలు సిద్ధం చేసి సమర్పించాడు. అందులో ‘జ్యోతి వర్సెస్ ఎలిగెంట్ అసోసియేట్స్’ అనే అసలు లేని తీర్పును ఉదహరించాడు. అయితే ఆ తీర్పుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు, పత్రాలు కోర్టుకు సమర్పించలేదు. దీంతో న్యాయమూర్తులు, లా క్లర్కులు ఆ కేసు కోసం వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదు.
వాదనల్లో పదేపదే ఒకే తరహా అంశాలు రావడం, గ్రీన్ బాక్స్ టిక్ మార్కులు, బుల్లెట్ పాయింట్లు కనిపించడం వంటి లక్షణాల ఆధారంగా ఇవి ఏఐ టూల్స్తో తయారయ్యాయని హైకోర్టు గుర్తించింది. ఈ తరహా కల్పిత కేసులు న్యాయస్థానం విలువైన సమయాన్ని వృథా చేస్తున్నాయని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించిన హైకోర్టు వ్యాఖ్యలను తొలగిస్తూ, ఏఐ దుర్వినియోగంపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
పరిశోధన వరకే ఏఐ వినియోగం:
న్యాయపరమైన పరిశోధనలకు ఏఐ టూల్స్ ఉపయోగకరమేనని, కానీ వాటి ద్వారా వచ్చిన ఉదాహరణలను కోర్టులో వినియోగించే ముందు వాటి నిజానిజాలను పూర్తిగా ధృవీకరించడం సంబంధిత వ్యక్తుల బాధ్యతేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై న్యాయపరంగా సమగ్రంగా పరిశీలన కొనసాగిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
