రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి దారి తీసిన పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాడివేడిగా వాదనలు సాగాయి.
ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్ట్ ను తెలంగాణ గట్టిగా వ్యతిరేకిస్తోంది. స్వయానా పిటీషన్ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్ట్ వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసింది. వాదనలను విన్న అనంతరం సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. తెలంగాణ, ఏపీ తరఫు సీనియర్ అడ్వొకేట్లు అభిషేక్ మను సింఘ్వీ, ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న కాలువల నిర్మాణం వల్ల వరద నీటిపై తెలంగాణకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మను సింఘ్వీ ఆందోళన వ్యక్తం చేశారు. నీటి మళ్లింపును నిలిపివేయాలని ఇప్పటికే కేంద్ర జల సంఘం (CWC) సూచించిన విషయాన్ని గుర్తు చేశారు.
అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం నల్లమల సాగర్ పనులు కొనసాగిస్తోందని, దీన్ని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. దీనిపై సీజేఐ స్పందించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడం వల్ల కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఎటువంటి మార్పులు లేదా మళ్లింపులు సాధ్యపడవని స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసిందని, దీని ముందు అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు.
ఇటువంటి అంతర్రాష్ట్ర జల వివాదాల విషయంలో ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్ దాఖలు చేయడమే సరైన మార్గమని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. దీనికి మను సింఘ్వీ బదులిచ్చారు. నిర్మాణ పనుల గురించి మాత్రమే కమిటీ ముందు ప్రస్తావించడానికి అవకాశం ఉందని, స్టే ఇచ్చే అధికారం లేదని వివరించారు. స్టే విషయంలో తుది నిర్ణయం/ఆదేశాలను సుప్రీంకోర్టు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఇవే పనులు మున్ముందు కూడా వాటిని రద్దు చేయడం అసాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ముకుల్ రోహత్గీ తన వాదనలను వినిపిస్తూ పోలవరంతో ముడిపడి ఉన్న మిగిలిన రాష్ట్రాలు కూడా పరిశీలించిన తర్వాతే నల్లమల సాగర్ డీపీఆర్ కు ఆమోదం లభిస్తుందని అన్నారు. తెలంగాణ ఆవిర్భవించక ముందు నుంచే పోలవరం ప్రాజెక్టు ఉందని గుర్తు చేశారు. వాదనలను విన్న అనంతరం సీజేఐ ధర్మాసనం ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.
