ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉన్న పాయకరావుపేట ఎస్సీ రిజర్వుడు నియోజవర్గం మాజీ శాసన సభ్యురాలు గంటెల సుమన (63) మృతి చెందారు.
శుక్రవారం తెల్లవారుజామున వారు కన్నుమూశారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రస్తుతం సుమన అక్కయ్యపాలెంలో నివసిస్తున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు.
చికిత్స పొందుతున్న క్రమంలో గంటెల సుమన తుదిశ్వాసను విడించారు. తన రాజకీయ ప్రస్థానంలో తొలుత తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఆమె విజయం సాధించారు. తరువాతి కాలంలో కాంగ్రస్ పార్టీలో చేరారు. 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
1989, 1994, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే సుమన పార్థివ దేహాన్ని అక్కయ్యపాలెంలోని ప్రియదర్శిని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ప్రజల సందర్శనార్థం ఉంచటం జరిగిందని, నేడు సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న ప్రముఖులు ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సుమన మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు.
