తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకున్న ఘటన స్థానికంగా కాదు, రాష్ట్రవ్యాప్తంగా కూడా కలకలం రేపుతోంది. అయినవిల్లి తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా తహశీల్దార్ నాగలక్ష్మమ్మపై మీసాల సత్యనారాయణ అనే వ్యక్తి అనూహ్యంగా కొడవలితో దాడికి తెగబడ్డాడు.
ఈ ఘటన అధికారుల భద్రతపై సందేహాలు రేకెత్తించడమే కాక, మానసిక ఆరోగ్య సమస్యలను ఎలా నిర్ధారించాలి అనే ప్రశ్నను కూడా తెరపైకి తెచ్చింది.
ఘటన ఎలా జరిగింది?
జోగిరాజుపాలెం గ్రామానికి చెందిన మీసాల సత్యనారాయణ, అనే వ్యక్తి నిన్న చేతి సంచిలో కొడవలి పట్టుకుని నేరుగా కార్యాలయంలోకి వెళ్లి తహశీల్దార్ నాగలక్ష్మమ్మపై విసిరాడు. దీంతో ఆమె చేతికి గాయమైంది. సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతన్ని కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో అతను మద్యం తాగి ఉన్నాడని తెలిపారు.
మద్యం మత్తులో విచక్షణ లేకుండా..?
సత్యనారాయణ ఘటన జరిగిన సమయంలో మద్యం తాగి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గతంలోనూ ఓ నేర సంఘటనలో అతను జైలుకు వెళ్లి వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. తన కొబ్బరితోటలు ఇతరులు ఆక్రమించుకున్నారని, భూపత్రాలు ఇప్పించాలంటూ అమలాపురంలో కలెక్టర్ కార్యాలయం, స్థానిక ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, పంచాయతీ కార్యాలయాల చుట్టూ అతను తిరుగుతుంటాడని స్థానికులు చెబుతున్నారు.
గ్రామస్థుల మాటల్లో…
కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, మద్యం సేవించి రహదారిపై కేకలు వేసుకుంటూ వెళ్తుంటాడని అంటున్నారు. అయితే సత్యనారాయణకు గ్రామంలో ఎటువంటి భూములు, భూసంబంధిత సమస్యలు లేవని తహశీల్దార్ నాగలక్ష్మమ్మ తెలిపారు.
అధికారుల స్పందన
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సత్యనారాయణను అరెస్టు చేశారు. కాగా, తహశీల్దార్ను కొత్తపేట ఆర్డీవో శ్రీకర్ పరామర్శించారు. తహశీల్దార్ పై మారణాయుధంతో దాడి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. తహశీల్దార్ను ఆయన ఫోన్లో పరామర్శించారు.