Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

యూపీలో పెరుగుతున్న ‘లవ్ జిహాద్’ కేసులు

ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముస్లిం యువతను లక్ష్యంగా చేసుకొని ‘లవ్ జిహాద్’ కేసులతో వేధిస్తోంది.

కఠినమైన మత మార్పిడుల నిరోధక చట్టం కింద కేసులు పెట్టి వారిని కటకటాల వెనక్కి నెడుతోంది. వారిలో మహమ్మద్ సఖీబ్ ఒకరు. 2020 డిసెంబర్ 14న అతను ఓ పుట్టినరోజు వేడుకకు హాజరై స్నేహితుడి ఇంటి నుండి బయలుదేరాడు. సైకిలుపై వస్తున్న ఓ బాలికను కొందరు యువకులు చుట్టుముట్టడాన్ని గమనించాడు.

వారి వద్దకు వెళ్లి ఏమైందని ఆరా తీశాడు. వారంతా అతనిపై దాడి చేశారు. ఆ మరునాడే పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. బాధిత బాలిక 16 సంవత్సరాల దళితురాలు.

చెప్పుడు మాటలు విని సఖీబ్పై ఆమె తండ్రి కేసు పెట్టాడు. తన కుమార్తెను సఖీబ్ కిడ్నాప్ చేసి, వివాహం చేసుకోవాల్సిందిగా బలవంతం చేశాడని ఆరోపించాడు. సఖీబ్ వయసు కూడా 16 సంవత్సరాలే. అతనిపై చట్టవ్యతిరేక మత మార్పిడుల నిరోధక ఆర్డినెన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఈ ఆర్డినెన్సునే ‘లవ్ జిహాద్’ చట్టం అంటున్నారు. ఈ చట్టం కింద కేసును ఎదుర్కొంటున్న ముస్లింలలో సఖీబ్ ఒకడు. ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన 18 రోజుల తర్వాత దాని కింద సఖీబ్ను అరెస్ట్ చేశారు. ఇది జరిగిన ఐదు సంవత్సరాలకు…మే 21న బిజ్నోర్లోని ప్రత్యేక న్యాయస్థానం అతనిని నిర్దోషిగా విడిచిపెట్టింది.

మత మార్పిడుల నిరోధక చట్టం కింద విచారణ జరిగిన తర్వాత అన్ని ఆరోపణల నుండి బయటపడిన తొలి ముస్లిం సఖీబేనని అతని న్యాయవాది తెలిపారు. కొన్ని కేసులలో పోలీసులు ఆరోపణలు ఉపసంహరించుకోగా మరికొన్ని కేసులలో ప్రాథమికవిచారణలోనే న్యాయస్థానాలు వాటిని కొట్టివేశాయి. అమ్రోహా, బరేలీ, ఆజామ్ఘర్ జిల్లాలలో కనీసం మూడు కేసులలో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. క్రైస్తవ మతంలోకి మారేలా దళితులను బలవంతం చేశారంటూ ఈ కేసులు పెట్టారు.

సఖీబ్ కేసును ఐదు సంవత్సరాల కాలంలో న్యాయస్థానం 74 సార్లు విచారించింది. చివరికి ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు చూపడంలో పోలీసులు విఫలమయ్యారని తేల్చింది. 2020 డిసెంబర్ 17న సఖీబ్ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అతనిపై మోపినవన్నీ నాన్ బెయిలబుల్ కేసులే.

ఆరు నెలల పాటు జైలులో ఉన్న తర్వాత అతనికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తొలుత సఖీబ్పై ఆరోపణలు చేసిన బాలిక తండ్రి ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. ఈ వ్యవహారాన్ని గ్రామ పెద్ద రాజకీయం చేశాడని ఆరోపించారు. ‘అదంతా రాజకీయం.

వాళ్లు నా కుమార్తె వీడియోలు తీసి ఇది లవ్ జిహాద్ కేసు అంటూ తప్పుడు ప్రచారం చేశారు’ అని చెప్పారు. ఉత్తరప్రదేశ్ మత మార్పిడుల నిరోధక ఆర్డినెన్స్ 2021 మే ఐదవ తేదీన చట్టంగా మారింది. దానిలో తీవ్రమైన శిక్షలు చేరుస్తూ గత ంవత్సరం ఆగస్ట్ 6వ తేదీన సవరించారు. 2020 నవంబర్ నుండి గత జూలై వరకూ ఈ చట్టం కింద 835 కేసులు నమోదు చేసి 1,682 మందిని అరెస్ట్ చేశారు. అయితే నేరం రుజువై శిక్షలు పడిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉన్నదని న్యాయవాదులు తెలిపారు.

Related posts

రేవంత్‌ రెడ్డికి సంబీత్‌ పాత్రా చురకలు

M HANUMATH PRASAD

రాజ్యసభకు కమల్‌ హాసన్‌.. డీఎంకే అధికారిక ప్రకటన

M HANUMATH PRASAD

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. 5,500కు పైగా విమానాలు రద్దు : కేంద్ర మంత్రి

M HANUMATH PRASAD

మరణశిక్ష పడిన దోషిని నిర్దోషిగా ప్రకటించిన సుప్రీంకోర్టు

M HANUMATH PRASAD

బదిలీపై వెళ్తున్న పోలీస్.. వెళ్లొదంటూ వెక్కివెక్కి ఏడ్చిన జనం.. వైరల్‌ అవుతున్న వీడియో!

M HANUMATH PRASAD

హిందూ మతాన్ని వీడారు.. దేశ ద్రోహానికి పాల్పడ్డారు.. బయటపడ్డ సంచలన నిజాలు..!!

M HANUMATH PRASAD