బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, ఎద్దులను, దూడలను కోయకుండా సీఎం, డీజీపీ చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. బక్రీద్ రోజున గోవధ జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.
బక్రీద్ పండుగను ఎలా జరుపుకుంటారో వాళ్ల ఇష్టమని… కానీ పశువుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు రాజా సింగ్ ఒక వీడియో విడుదల చేశారు. ”జూన్ 7వ తేదీన లా అండ్ ఆర్డర్ సమస్య రావొద్దంటే ఒక్క ఆవు, ఒక్క ఎద్దు, ఒక్క దూడ కూడా కట్ కావొద్దు… బక్రీద్ మీరు ఏ విధంగా జరుపుకుంటారో జరుపుకోండి… కానీ మా ఆవులను చంపకూడదు…గోవధ జరగకుండా చూసే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ జితేందర్ల మీద ఉంది” అని రాజా సింగ్ అన్నారు. ”సీఎం రేవంత్ రెడ్డి కూడా గోమాత ప్రేమికులు… ఎన్నికల సమయంలో మీరు గో మాతకు పూజ చేశారు… తెలంగాణకు రాజు మీరు… రాష్ట్రంలో ఏదైనా అపవిత్రం జరిగితే ఆ పాపం మీకే తగులుతుంది… అది మీరు తెలుసుకోండి. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి, డీజీపీలకు రిక్వెస్ట్ చేస్తున్నా… లా అండ్ ఆర్డర్ డిస్ట్రబ్ కావొద్దంటే, ప్రతి ఒక్క చెక్ పోస్టులో మంచి ఆఫీసర్లను పెట్టి ఒక్క ఆవు, ఒక్క ఎద్దు, ఒక్క దూడ కూడా సిటీలో ఎంటర్ కాకుండా చూడాలి. ఇప్పటికే ఎన్నో ఆవులు, ఎద్దులు, దూడలు సిటీలోకి ఎంటర్ అయిపోయాయి… ఓల్డ్ సిటీలో, న్యూ సిటీలో, కొన్ని జిల్లాల్లో రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నారు… అక్కడ వెటర్నిటీ డాక్టర్ను తీసుకుని వెళ్లి మీరు చెక్ చేయండి… మంచి ఎద్దులు కనబడితే సీజ్ చేయండి… వాటిని తీసుకొచ్చినవారిపై కఠిన చర్యలు తీసుకోండి” అని రాజా సింగ్ కోరారు. ఒక్క ఆవు, ఎద్దు, దూడను కోసినా ఊరుకునే ప్రసక్తే లేదని రాజా సింగ్ అన్నారు. తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే తాము బాధ్యులం కాదని చెప్పారు. పశువుల రవాణాలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. పశువుల వాహనాలను పోలీసులు తూ తూ మంత్రంగా చెక్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ రవాణాను అడ్డుకుంటున్న తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు