వారసులు అన్న అంశం ఎక్కువగా భారతదేశంలోనే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రజాదరణ కలిగిన రంగాలలో పేరు తెచ్చే రంగాలలో ఈ అంశం తరచుగా చర్చకు వస్తుంది.
ఇదంతా ఎందుకు అంటే ఆయా రంగాలు అత్యంత పవర్ ఫుల్ కాబట్టి. అంతే కాదు జనం ఎక్కువగా ఆసక్తి చూపించే రంగాలు కూడా కాబట్టి.
మహానాడు వేదికగా నారా లోకేష్ టీడీపీకి భావి వారసుడిగా ప్రాజెక్ట్ చేయడంలో చంద్రబాబు నూరు శాతం సక్సెస్ అయ్యారు. అంతే కాదు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అన్న గారి చేతనే నా మనవడు నా బాటలో నడుస్తున్నాడు అని చెప్పించడం ద్వారా ఆ తాతకు ఈ మనవడే వారసుడు అని అందరి చేత ఒప్పించగలిగారు అంటున్నారు.
సరే ఇది టీడీపీ మహానాడు, వారి పార్టీ పండుగకు ఏఐ రూపంలో వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ అలాగే మాట్లాడుతారు అని అంటున్నారు. అయితే ఆయన ద్వితీయ కళత్రం గా ఉన్న లక్ష్మీ పార్వతి మాత్రం ఒక లాజిక్ పాయింట్ ని పట్టుకుని చంద్రబాబుని లోకేష్ ని విమర్శిస్తున్నారు. ఎన్టీఅర్ కి లోకేష్ ఎలా వారసుడు అవుతారు అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
కూతుకు కొడుకు వారసుడు ఎలా కుదురుతుంది అని అంటున్నారు. ఇంటిపేరు ఉన్న వారే వారసులుగా ఉంటారు ఇది సంప్రదాయం ఇదే విధానం అని ఆమె అంటున్నారు. నందమూరి తారక రామారావుకు నారా లోకేష్ వారసుడు ఏమిటి అని ఆమె మండిపడ్డారు. నందమూరి వారి ఇంట కొడుకులు మనవలు చాలా మంది ఉన్నారు కదా వారే వారసులు అవుతారు అని ఆమె చెబుతున్నారు. బహుశా ఆమె దృష్టిలో జూనియర్ ఎన్టీఆర్ అన్న గారికి అసలైన వారసుడు అన్న భావన ఉంటే ఉండొచ్చు.
అయితే ఆమె లేవనెత్తిన కూతురు కొడుకు వారసుడు అవుతానా కాదా అన్నది. అయితే ఆమె చెబుతున్నది భారతీయ సంప్రదాయం అని అంటున్న వారూ ఉన్నారు. వారసుడు అన్నది ఇంటి పేరుతోనో ఒంటి పేరు తోనో రాదు, అది ప్రతిభను బట్టి వస్తుంది అని అంటున్నారు. ఎవరైతే తమ పూర్వీకుల ఆశలను ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తామని కంకణం కట్టుకుని ముందుకు అడుగులు వేస్తారో వారే వారసులు అని అనే అభ్యుదయవాదులూ ఉన్నారు.
ఈ విషయం ఒక వైపు ఉంటే రాజకీయంగా చూస్తే నారా లోకేష్ సీనియర్ ఎన్టీఆర్ కి వారసుడు అవుతారా కారా అంటే దాని మీద ఎవరి వాదన వారికి ఉంది. ఎన్టీఆర్ నుంచి పార్టీ చంద్రబాబుకు 1995లోనే బదిలీ అయింది. అలా మూడు దశాబ్దాలకు పైగా బాబు టీడీపీని తన భుజాల మీద ఉంచి ముందుకు నడిపిస్తున్నారు. ఇపుడు ఆయన తన కుమారుడికి ఆ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు.
అలా నారా టూ నారాకు ఈ నాయకత్వ బదలాయింపూకు ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవు కదా అన్న వారూ ఉన్నారు. పైగా ఎన్టీఆర్ పార్టీని స్థాపించి ఉండొచ్చు, కానీ ఆయన టీడీపీని పటిష్టం చేసి కొనసాగించింది నారా చంద్రబాబు కాబట్టి ఆ పార్టీ మీద నూరు శాతం హక్కులు బాబుకు ఉంటాయని ఆయన తన వారసుడికి అదే హోదాలో అప్పగించ బోతున్నారు అని అంటున్నారు.
ఇక ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలు పార్టీ రాజ్యాంగాలు చూసుకున్నా లోకేష్ వారసుడిగా అర్హుడే అని అంటున్నారు. అదెలా అంటే లోకేష్ టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి పార్టీ క్యాడర్ సర్వామోదం కావాలి. అది నిండుగా ఆయనకు లభిస్తున్న వేళ ఆయనను కాదని ఎవరు అనగలరు అన్నది మరో చర్చ.
ఇక సీనియర్ ఎన్టీఆర్ కి లోకేష్ వారసుడు అవునా కాదా అన్నది సనాతన ధర్మ సూక్ష్మాల్లోకి వెళ్ళి శోధించడం కంటే ఆయన పార్టీని లీడ్ చేసే విధానం అలాగే ఆయన నాయకత్వ ప్రతిభ దీక్షా దక్షతలనే కొలమానంగా తీసుకుని జడ్జి చేయాలని అంటున్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా బాబుకు అత్తయ్య, లోకేష్ కి బామ్మ అయిన లక్ష్మీపార్వతి మాత్రం లోకేష్ ని ఎన్టీఆర్ వారసుడిగా దీవించడం లేదు. వ్యక్తిగత ఇష్టాఇష్టాలతో ఇక్కడ పని లేదు కాబట్టి పార్టీ జనాలు బయట జనాల మద్దతే లోకేష్ కి ముఖ్యం. అందువల్ల ఆయన ముందు ముందు తన సత్తాని పూర్తి స్థాయిలో నిరూపించుకోవాల్సి ఉందని అంటున్నారు.