భారాస (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)కు తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) ప్రశ్నించారు.
కట్టడి చేయమంటే పెయిడ్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని ఆరోపించారు. మీడియాతో చిట్చాట్లో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
లీకు వీరులను ఎండగట్టమంటే నాపై ప్రతాపమా?
”కేసీఆర్కు నోటీసులు ఇస్తే నేతలెవరూ స్పందించకపోతే ఎలా? నాకు నీతులు చెబుతూ కోవర్టులు ఉన్నారంటున్నారు. నా మీద పడి ఏడిస్తే ఎలా?ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా? లిక్కర్ కేసు సమయంలో రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారు. సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఎంపీగా ఓడించారు. అదే జిల్లాలో ప్రొటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారు. లీకు వీరులను ఎండగట్టమంటే నాపై ప్రతాపం చూపుతున్నారు. కాంగ్రెస్, భాజపాపై మాట్లాడాలి కానీ.. నాపై దాడి చేస్తే ఎలా?.
జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే వ్యతిరేకించా
భారాసను గంపగుత్తగా భాజపాకు అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోంది. జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే నేను వ్యతిరేకించాను. భాజపాలో భారాస విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే నా అభిమతం. నాపై దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించలేదు. నన్ను పార్టీ నుంచి ఎవరు బయటకు పంపుతారు?.. అంత సీన్ లేదు. కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపినట్లు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం. భారాసలో కేసీఆర్ మాత్రమే నాకు నాయకుడు.. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాను. వెన్నుపోటు పొడవడం నా లక్షణం కాదు… నేరుగానే పోరాడతాను.
కడుపులో బిడ్డను పెట్టుకుని ఉద్యమంలో పనిచేశా
దేశం వెలుపల ఐటీ సెల్లు పెట్టి నాపై పోరాడుతామంటే ఎలా?దొంగల్ని పట్టుకోమంటే చేతగాక నాపై ప్రతాపం చూపితే ఎలా? పార్టీ నాది అని ప్రతి ఒక్కరూ పోరాడితేనే ఫలితం ఉంటుంది. కేసీఆర్కు నోటీసులు ఇస్తే.. కేవలం ఎక్స్లో పోస్టు పెట్టి వదిలేస్తే ఎలా? నేను ఏనాడూ పదవుల కోసం పోరాడలేదు. కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో సైనికురాలిగా పనిచేశాను. నన్ను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడన ఉన్నారు తప్ప.. చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి?” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.