అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)(App) అధినేత, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పార్లమెంట్కు వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది
.
పంజాబ్(Punjab) నుంచి రాజ్యసభకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆయన జాతీయ రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా అడుగుపెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. పంజాబ్ నుంచి కేజ్రీవాల్(Kejriwal)ను రాజ్యసభకు పంపడం ద్వారా ఆ రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ ప్రభావాన్ని చూపొచ్చని ఆప్ భావిస్తోంది. దిల్లీ(Delhi) అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో నాలుగున్నరేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయిలో రాజకీయంగా యాక్టివ్గా ఉండాలని కేజ్రీవాల్ సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబ్. ఆ రాష్ట్రంలోని లూథియానా (పశ్చిమ) అసెంబ్లీ స్థానం ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ బస్సీ గోగి ప్రమాదవశాత్తు తుపాకీతో కాల్చుకొని మరణించారు. ఆ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాను బరిలోకి దింపారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు.
త్రిముఖ పోరుకు రంగం సిద్ధం
లూథియానా (పశ్చిమ) అసెంబ్లీ స్థానం నుంచి సంజీవ్ అరోరా గెలిచి రాజ్యసభ సీటుకు రాజీనామా చేస్తే ఆ సీటుతో తాను పెద్దల సభకు వెళ్లాలని కేజ్రీవాల్ భావిస్తున్నారట. అయితే ఆయన అంచనాలు నిజమవడం అంత సులభమేం కాదు. ఎందుకంటే లూథియానా (పశ్చిమ) అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్లు కూడా అభ్యర్థులను ప్రకటించాయి. గతంలో రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన, మాజీ మంత్రి భరత్ భూషణ్ ఆశును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. సీనియర్ న్యాయవాది పరుప్కర్ సింగ్ ఘుమ్మన్కు శిరోమణి అకాలీదళ్ టికెట్ ఇచ్చింది. దీంతో అక్కడ త్రిముఖ పోరుకు రంగం సిద్ధమైంది.
పంజాబీలకే రాజ్యసభ సీట్లు ఇవ్వాలి
అధికార ఆప్పై ప్రజా వ్యతిరేకత పెరిగిందని ప్రతిపక్షాలు వాదిస్తుండగా, అలాంటిదేం లేదని ఆప్ అంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లో ఆప్ అఖండ విజయం సాధించగా, కాంగ్రెస్ అధికార పీఠాన్ని కోల్పోయింది. తమ పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడిందని, ఈ ఉప ఎన్నిక ఫలితం ద్వారా నిరూపించుకోవాలని హస్తం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. మరోసారి లూథియానా (పశ్చిమ) అసెంబ్లీ స్థానాన్ని ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆప్ ఉంది. ఈ ఆకాంక్ష నెరవేరితేనే సంజీవ్ అరోరా ఎమ్మెల్యే అవుతారు. అరవింద్ కేజ్రీవాల్ కోసం రాజ్యసభ సీటు ఖాళీ అవుతుంది.
దిల్లీలో రాజకీయాలు చేస్తున్న కేజ్రీవాల్
దిల్లీలో రాజకీయాలు చేస్తున్న కేజ్రీవాల్, రిమోట్ కంట్రోల్ ద్వారా పంజాబ్ రాజ్యసభ సీటును పొందేందుకు ప్రయత్నాలు చేస్తుండటాన్ని అక్కడి విపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. పంజాబ్ పరిధిలోని రాజ్యసభ సీట్లను పంజాబీలకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. పంజాబ్ వెలుపలి వ్యక్తులకు రాజ్యసభ సీట్లను ఇస్తుండటంపై సీఎం భగవంత్ సింగ్ మాన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
జాతీయ రాజకీయాల్లో కేజ్రీవాల్ కీలక పాత్ర
దశాబ్ద కాలం పాటు దిల్లీని ఆప్ పాలించింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. న్యూదిల్లీ అసెంబ్లీ సీటులో అనూహ్యంగా కేజ్రీవాల్ సైతం ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభకు వెళ్లడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేజ్రీవాల్ ప్లాన్ చేసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఆప్ మొదటి నుంచే తీవ్రంగా శ్రమిస్తోంది. 2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల గెలిచిన తర్వాత ఆప్కు జాతీయ పార్టీ హోదా లభించింది.