హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం.
ఈ మేరకు పార్లమెంట్ వానాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. జస్టిస్ యశ్వంత్వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో.. ఆయన నివాసంలో అగ్నిప్రమాదం జరిగి, భారీగా నోట్ల కట్టలు బయటపడి కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జీలతో ఏర్పాటు చేసిన కమిటీ విచారణ జరిపి… జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనంటూ నివేదిక ఇచ్చింది. మే 9న అప్పటి సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ఖన్నా.. ఈ నివేదికను, జస్టిస్ యశ్వంత్వర్మను అభిశంసించి, పదవి నుంచి తొలగించాలన్న సిఫార్సును రాష్ట్రపతికి, ప్రధానికి పంపారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఇటీవలే సుప్రీం సీజే ప్రతిపాదనను రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్లకు పంపినట్టు సమాచారం. అభిశంసన మార్గదర్శకాల ప్రకారం.. లోక్సభ, రాజ్యసభల్లో ఈ ప్రతిపాదనను ప్రవేశపెడతారు. ఒక కమిటీ వేసి ఆరోపణలపై విచారణ చేయిస్తారు. ఆ కమిటీ ఇచ్చే నివేదికను ఇరు సభల్లో ప్రవేశపెట్టి చర్చిస్తారు. అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. అభిశంసనకు అనుకూలంగా ఓటింగ్ జరిగితే… న్యాయమూర్తి తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. నిజానికి రాజీనామా చేయాల్సిందిగా జస్టిస్ యశ్వంత్వర్మను సుప్రీంకోర్టు కోరినా ఆయన నిరాకరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అభిశంసనకు సిఫార్సు చేసినట్టు తెలిసింది.