కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన సినిమా థియేటర్ల ఎగ్జిబిటర్ల వివాదంపై నిర్మాత శ్రీనివాస్ కుమార్ (ఎస్కేఎన్) స్పందించారు.
‘ఘటికాచలం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దీని గురించి మాట్లాడారు. ఈ వివాదంపై (Exhibitors Producers) సినీ పెద్దలు ఆలోచించాలన్నారు. అలాగే మీడియా కూడా సినీ రంగానికి సహకరించాలని కోరారు. ఇండస్ట్రీ ఐసీయూలో ఉందన్నారు. ఇది యాంటీ బయాటిక్స్ ఇవ్వాల్సిన సమయమన్నారు.
”పర్సంటేజీల విధానంపై కాకుండా థియేటర్లలో ప్రేక్షకుల పర్సంటేజీ పెంచే విషయంపై సినీ పెద్దలు ఆలోచన చేయాలి. టికెట్ ధరలు, తినుబండారాలు, ఓటీటీల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారు. దీన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి. మార్నింగ్ షోకు వచ్చే ఆడియన్స్ తగ్గిపోతున్నారు. ఈవెనింగ్ షో, వీకెండ్స్లలో ఆడియన్స్ బాగా వస్తున్నారు. దీన్ని దృష్టిలోపెట్టుకొని టికెట్ ధరల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలి. మాములు రోజుల్లో టికెట్ ధరలు తగ్గించడమా.. లేదంటే వీకెండ్స్లో ధరలు పెంచడమా అనే దానిపై ఆలోచన చేయాలి. ఆడియన్స్ థియేటర్కు రావడానికి ఆసక్తి చూపడం లేదు. రెండు వారాల్లో ఎలాగూ ఓటీటీకి వస్తుంది కదా.. ఇంక థియేటర్కు ఎందుకు అని అనుకుంటున్నారు. ఇప్పుడు హిందీ, తమిళంలో ఉన్నట్లు కచ్చితంగా 8 వారాల తర్వాతే ఓటీటీకి వచ్చేలా ఏర్పాటుచేయాలి. ఇలా ఎన్నో విషయాలపై చర్చ జరగాలి” అని చెప్పారు. ఇది తన (SKN) వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు
జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అద్దె ప్రాతిపదికన సినిమాల్ని ప్రదర్శిస్తుండడంతో తమకు ఆదాయం సరిపోవడం లేదని, మల్టీప్లెక్స్ తరహాలోనే వసూళ్లలో పర్సెంటేజీ విధానాన్ని అమలుచేయాలంటూ సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు పట్టుబట్టాయి. మల్టీప్లెక్స్ల్లో పర్సెంటేజీల ప్రకారం ప్రదర్శనలు జరుగుతుండగా, తాము మాత్రం అద్దె ప్రాతిపదికన ఎందుకు సినిమాల్ని ప్రదర్శించాలని పలువురు యజమానులు తమ వాదనను ఇటీవల జరిగిన సమావేశంలో వినిపించారు
