నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది.
ఎన్నికల్లో పార్టీ టికెట్లు కేటాయిస్తామని, పదవులకు ఎంపికచేస్తామని, వ్యాపారాలకు రక్షణ కల్పిస్తామంటూ వివిధ వ్యక్తుల నుంచి పార్టీ సీనియర్ నేతల ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డారని తెలిపింది. వివిధ మార్గాల్లో రూ.988 కోట్లకుపైగా అక్రమంగా సంపాదించినట్లు పేర్కొంది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 3, 4 కింద.. దిల్లీ కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో ఈ విషయాలను వెల్లడించింది. సోనియా, రాహుల్ గాంధీలతో పాటు పార్టీ సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, పిట్రోడా, ప్రైవేటు కంపెనీ ‘యంగ్ ఇండియన్’ను నిందితులుగా చేర్చింది. వీరందరూ కుట్రపూరితంగా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో భాగస్వాములని ఆరోపించింది. మోతీలాల్ వోరా 2020లో, ఆస్కార్ ఫెర్నాండెజ్ 2021లో మృతిచెందారు.
సోనియా, రాహుల్ ప్రభావంతోనే…
‘యంగ్ ఇండియన్’ ప్రైవేటు కంపెనీలోని కార్యనిర్వాహకులందరూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలని, వీరంతా సోనియా, రాహుల్ కనుసన్నల్లోనే ఆయా బాధ్యతలు నిర్వహించేవారని ఈడీ తెలిపింది. ఏఐసీసీ అధ్యక్షురాలు(2010-11)గా ఉన్న సమయంలో సోనియా తన హోదాను స్వప్రయోజనాలు, రాహుల్ కోసం దుర్వినియోగపరిచారని ఆరోపించింది.
