అ మెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వలసదారుల బహిష్కరణకు సంబంధించిన కేసులో న్యాయస్థానం వెలువరించిన ఆదేశాలను ఆయన తీవ్రంగా ఖండించారు.
వెనెజులాకు చెందిన ఓ ముఠాను దేశం నుంచి బహిష్కరించేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేయడమే ఈ ఆగ్రహానికి కారణం. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఓ పోస్టు పెట్టారు.”చట్టవిరుద్ధంగా మన దేశంలోకి ప్రవేశించిన వారిని బలవంతంగా వెనక్కి పంపేందుకు అనుమతించబోమని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది” అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. “అలాంటి వారిలో చాలామంది హంతకులు, మాదకద్రవ్యాల వ్యాపారులు, ఇతర నేరస్థులు ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల వారిని చట్టబద్ధంగా దేశం నుంచి పంపించడానికి ఏళ్ల సమయం పడుతుంది.
ఈలోగా వారు దేశంలో మరెన్నో నేరాలకు పాల్పడే అవకాశం ఉంది” అని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితి అమెరికన్లకు తీవ్ర హాని కలిగిస్తుందని, కోర్టు తీర్పు మరింత మంది నేరగాళ్లు దేశంలోకి అక్రమంగా రావడానికి ప్రోత్సాహం అందించినట్లే అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. “వారు ఇక్కడికి వచ్చి విధ్వంసం సృష్టిస్తారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో లక్షలాది మంది క్రిమినల్స్ అక్రమంగా దేశంలోకి ప్రవేశించారు. అలాంటి వారిని బయటకు పంపించడానికి ఇప్పుడు మనం సుదీర్ఘమైన చట్టపరమైన ప్రక్రియను అనుసరించాల్సి వస్తోంది. ఇది అమెరికాకు అత్యంత చెడ్డ, ప్రమాదకరమైన రోజు” అని ట్రంప్ తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.
