మరాఠా రిజర్వేషన్ల చట్టపరపమైన చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు బాంబే హైకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
జస్టీస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ ఎన్.జె.జమాదార్, జస్టిస్ సందీప్ మార్నెలతో కూడిన పూర్తిస్థాయి ధర్మాసనాన్ని ఏర్పాటు చేసినట్లు శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. అయితే ఈ నోటీసులో విచారణ తేదీని వెల్లడించలేదు.
మరాఠాలు రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించాల్సిన వెనకబడిన సమాజం కాదంటూ, ఆ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన కొన్ని పిటిషన్లపై హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డి.కె. ఉపాధ్యాయ నేతృత్వంలోని పూర్తి ధర్మాసనం గతేడాది విచారణ ప్రారంభించింది. రిజర్వేషన్లపై మహారాష్ట్ర ఇప్పటికే 50శాతం పరిమితిని దాటిందని కూడా పిటిషన్లు వాదించాయి. అయితే ఈ ఏడాది జనవరిలో హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయడంతో విచారణ నిలిచిపోయింది. ఈ పిటిషన్లపై ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి అత్యవసరంగా విచారించాలని మే 14న సుప్రీంకోర్టు బాంబే హైకోర్టును ఆదేశించిన సంగతి తెలిసిందే. 2025లో జరిగిన నీట్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
మహారాష్ట్ర జనాభాలో సుమారు మూడింట ఒక వంతు ఉన్న మరాఠా కమ్యూనిటీకి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించే 2024 చట్టం గతేడాది లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ చర్చల్లో ప్రధానాంశంగా నిలిచింది.