భా రత ఆర్థిక, వాణిజ్య వ్యవస్థను దెబ్బతీసేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వేదికల్లో భారత్ ను తక్కువ చేసి ట్రంప్ మాట్లాడటంపై యావత్ భారతావని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది
ఇప్పటికే భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తన జోక్యంతోనే జరిగిందని ట్రంప్.. ఎక్కడపడితే చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అంతేకాక తన దృష్టిలో భారత్- పాకిస్థాన్ రెండూ ఒకటేనని.. ఇరు దేశాల అధినేతలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.
తాజాగా భారత్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. భారత ఆర్థిక, వాణిజ్య వ్యవస్థను దెబ్బతీసేలా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఖతర్ లో నిర్వహించిన ఓ వాణిజ్య కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్.. కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో యాపిల్ సంస్థ పెట్టుబడులు పెట్టడం, యాపిల్ ఫోన్లను తయారు చేయడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
ఖతర్ లోని మీటింగ్ లో ట్రంప్ ప్రసంగిస్తూ.. “భారత్లో ఐఫోన్లను తయారు చేయవద్దు. యాపిల్ ఐఫోన్లను భారత్లో తయారు చేయడం నాకు ఇష్టం లేదని యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ కు చెప్పాను. భారత్ లో టారిఫ్ లు అధికం. దానివల్ల యాపిల్ కంపెనీకి లాభం తక్కువ. టిమ్ కుక్ దీన్ని ఆలోచించాలి. అమెరికాలో పెట్టుబడులు పెట్టండి. యాపిల్ సంస్థకు అమెరికా అన్ని విధాల అండగా ఉంటుంది” అని ట్రంప్ పేర్కొన్నారు. ఆయన వెంట యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ కూడా ఉన్నారు.
ఇదే విషయంపై భారత్ అధికార ప్రతినిధులు మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా సెల్ ఫోన్ తయారీలో భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారిందని తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు. మొబైల్ తయారీలో భారత్ అగ్రశ్రేణిలో ఉందని.. ప్రపంచంతో పోటీ పడుతోందని అన్నారు. యాపిల్ కు నష్టం అని భారత్ కు ఎలాంటి నష్టం లేదని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేపట్టిన ఏ కంపెనీకైనా తెలుసు.. తమ విధానాలు ఏంటో. అందుకే మరిన్ని కంపెనీలు భారత్ ను ఎంచుకుంటున్నాయని స్పష్టం చేశారు.
యాపిల్ లాంటి దిగ్గజ సంస్థలు అంతర్జాతీయ రాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా వ్యవహరించాలని భారత అధికార ప్రతినిధులు తెలిపారు. కంపెనీలకు మరో కంపెనీతో పోటీ ఉండాలి తప్ప మరోటి కాదని స్పష్టం చేశారు. ఇక మొబైల్ తయారీలో భారత్ దూసుకెళ్తోంది. దాదాపు 40 మిలియన్ ఐఫోన్లు భారత్ లో తయారు అవుతున్నాయి. అంటే మొత్తం ఐఫోన్ ప్రపంచ మార్కెట్ లో 15 శాతం ఇక్కడే తయారవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 22 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన యాపిల్ ఫోన్లు భారత్ లో తయారు చేసింది. భారత్ లో చేసిన ఈ ఐఫోన్ లు అత్యధికం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి.
ఒక్క మార్చి నెలలోనే 30 లక్షలకు పైగా ఐఫోన్లు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యాయి. తెలంగాణలోని ఫోక్స్ కాన్ అనే ఎయిర్ పాడ్స్ సంస్థ కూడా ఎగుమతులనుస్టార్ట్ చేసింది. యాపిల్ కంపెనీల ద్వారా భారత్ లో 2 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ఇండియాను హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చామని ఓ అధికారి పేర్కొన్నారు.
ఇక భారత్- అమెరికా మధ్య ప్రస్తుతం వాణిజ్యం బలంగా ఉంది. ఇరు దేశాల మధ్య 129 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన వ్యాపారం కొనసాగుతోంది.
