కాశీష్ చౌదరి అనే పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే… పాకిస్తాన్లోని హిందూ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన 25 ఏళ్ల కాశీష్ చౌదరి బలూచిస్తాన్లో అసిస్టెంట్ కమిషనర్గా నియమితులైన మొదటి మహిళగా నిలిచారు.
తద్వారా కాశీష్ చౌదరి చరిత్ర సృష్టించారు. కాశీష్ చౌదరి తన తండ్రి గిర్ధారి లాల్తో కలిసి సోమవారం రోజున క్వెట్టాలో బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తిని కలిశారు. ఈ సందర్భంగా మహిళలు, మైనారిటీల సాధికారత కోసం, ప్రావిన్స్ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని కాశీష్ చౌదరి చెప్పారు. మైనారిటీ వర్గాల సభ్యులు తమ కృషి కారణంగా కీలక పదవులను పొందడం దేశానికి గర్వకారణమని ముఖ్యమంత్రి బుగ్తి అన్నారు. కాశీష్ చౌదరి… దేశానికి, బలూచిస్తాన్కు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఇదిలాఉంటే, ”నా కుమార్తె తన కృషి, నిబద్ధత కారణంగా అసిస్టెంట్ కమిషనర్గా మారడం మాకు చాలా గర్వకారణం. తన కుమార్తె ఎప్పుడూ చదువుకోవాలని, మహిళల కోసం ఏదైనా చేయాలని కలలు కనేది” అని గిర్దారి లాల్ అన్నారు. కాశీష్ చౌదరి విషయానికి వస్తే… బలూచిస్తాన్ ప్రావిన్స్లోని చాగై జిల్లాలోని నోష్కి అనే మారుమూల పట్టణానికి చెందినవారు. ఆమె తండ్రి స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్నారు. వారిది మధ్య తరగతి కుటుంబం. బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా… అసిస్టెంట్ కమిషనర్గా ఉద్యోగం సంపాదించుకున్నారు. కాశీష్ చౌదరి ఒక వార్తా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… తన విజయానికి మూడు సంవత్సరాల క్రమశిక్షణతో కూడిన కృషి ఉందని చెప్పారు. ”నేను రోజుకు కనీసం ఎనిమిది గంటలు చదివేదానిని. అది కష్టమే… కానీ సమాజానికి సేవ చేయాలనే నా సంకల్పం నన్ను ముందుకు నడిపించింది” అని కాశీష్ చౌదరి పేర్కొన్నారు. ఇక, ఇటీవలి సంవత్సరాలలో హిందూసమాజానికి చెందిన మహిళలు పాకిస్తాన్లోని పలు పురుషాధిక్య రంగాలలో గణనీయమైన విజయాన్ని సాధించారు. ముఖ్యమైన పదవులను పొందడానికి అనేక సాంస్కృతిక, మతపరమైన, సామాజిక అడ్డంకులను అధిగమిస్తున్నారు. 2022 జూలైలో మనేష్ రోపెటా కరాచీలో పోలీసు సూపరింటెండెంట్గా నియమితులైన మొదటి హిందూ మహిళ అయ్యారు, అక్కడ ఆమె ఇప్పటికీ తన విధులను నిర్వర్తిస్తున్నారు. పుష్ప కుమారి అనే మహిళా కరాచీలో పోలీసు సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. 2019లో సింధ్ ప్రావిన్స్లోని షాహదద్కోట్లో సివిల్ జడ్జిగా నియమితులైన సుమన్ పవన్ బోదాని ప్రస్తుతం హైదరాబాద్లో సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు.
